విదేశీ మారకం నిల్వల్లో కొత్త రికార్డు

దేశంలో విదేశీ మారకం నిల్వలు కొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. జూలై 2తో ముగిసిన వారంలో అంతక్రితం వారంకంటే 1 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 610 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు శుక్రవారం ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. గ‌త నెల 25వ తేదీతో ముగిసిన వారానికి 5.066 బిలియ‌న్ల డాల‌ర్లు పెరిగి 608.999 బిలియ‌న్ల‌కు చేరుకుంది.
 
జూన్‌ 25తో ముగిసిన వారంలో ఇవి 609 బిలియన్‌ డాలర్లు. ఈ వారంలో ఫారిన్ క‌రెన్సీ అసెట్స్ పెర‌గ‌డం వ‌ల్లే ఫారెక్స్ నిల్వ‌లు పెరిగాయి. మొత్తం రిజర్వుల్లో అధికంగా ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు.. సమీక్షా వారంలో 74.8 కోట్ల డాలర్ల మేర పెరిగి 566.99 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వ లు 7.6 కోట్ల డాలర్ల వరకు పెరిగి 36.37 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
 
స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌లు) 4.9 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెంది 1.55 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్‌ వద్ద ఉంచే రిజర్వులు 13.9 కోట్ల డాలర్ల వరకు పెరిగి 5.11 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

దివాలా చట్టం కింద ఇన్వెస్టర్లకు భద్రత

మరోవంక,  చిన్న ఇన్వెస్టర్లను రక్షించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, స్టాక్ ఎక్సేంజ్‌లు మరిన్ని రక్షణ చర్యలను ప్రకటించాయి. దివాలా చట్టం కింద కంపెనీ వాటాల్లో ధరల తారుమారు నియంత్రణ కోసం చర్యలు చేపట్టనున్నాయి. 
 
ఐబిసి (దివాలా చట్టం) ప్రకారం, కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సిఐఆర్‌పి) కింద లిస్టెడ్ కంపెనీలు వస్తాయని, మార్కెట్ సమాచారంలో గందరగోళం నియంత్రించేందుకు పలు చర్యలు చేపట్టనున్నామని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఇ), బిఎస్‌ఇ (బాంబే స్టాక్ ఎక్సేంజ్)లు తెలిపాయి. 
 
గతంలో వాటాదారులు మోసపోయారు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్), జెట్ ఎయిర్‌వేస్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ సంస్థలకు సంబంధించిన సమాచారంతో ఈక్విటీ వాటాదారులు దెబ్బతిన్నారు. ప్రస్తుత అలాంటి పరిస్థితులు రాకుండా స్టాక్ ఎక్సేంజ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రత్యేకించి చిన్న ఇన్వెస్టర్ల వాటాలకు భద్రత ఇచ్చేందుకు ఈ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి.