జగన్ కేసుల్లో నిందితులకు హైకోర్టు షాక్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి తెలంగాణ హైకోర్టు తాజాగా షాకిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన వేర్వేరు ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న వారిలో ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. 
 
దీంతో వీరంతా ఒక్కో కేసులో గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. దీంతో అలా కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులు దాఖలు చేసిన విముక్తి పిటిషన్లపై సీబీఐ దాఖలు  చేసిన కేసుల ఆధారంగానే విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో వీరంతా ప్రతీ కేసులోనూ తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
 
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఛార్జిషీట్లలో జగన్‌తో పాటు దాదాపు 100 మందికి పైగా సహ నిందితులు ఉన్నారు. వీరంతా కొన్నళ్లుగా తమపై సీబీఐ కోర్టు విచారణను నిలిపేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఇందులో కొందరికి విముక్తి కూడా లభించింది.
 
 గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావిస్తూ వీరంతా ఊరట పొందుతున్నారు. దీంతో మిగిలిన నిందితులు కూడా తమకు కూడా వారి తరహాలోనే విముక్తి కల్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వారికి వర్తింపచేసిన తీర్పులనే తమకూ వర్తింపచేయాలని హైకోర్టును కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.