నాంపల్లి కోర్ట్ లో దర్భంగ పేలుళ్ల నిందితులు

బిహార్ దర్భంగ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను ఎన్‌ఐఎ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై భారీ భద్రత నడుమ పాట్నాకు తరలించారు. ఈక్రమంలో నిందితులను పాట్నాలోని ఎన్‌ఐఎ కోర్టులో హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు. 

కాగా దర్భంగ పేలుళ్ల కేసు గురించి మరింత లోతుగా నిందితులను విచారించేందుకు నిందితులిద్దరిని ఎన్‌ఐఎ కస్టడీలోకి తీసుకోనుంది. పేలుళ్ల ఘటన జరగడానికి కొద్ది నెలల ముందు అన్నదమ్ముల్లో చిన్నవాడైన నాసిర్ మాలిక్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని స్వగ్రామానికి వెళ్లి వచ్చినట్టు దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో తేలింది. 

ఆ సమయంలోనే పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో నిందితులు ఐఇడి రసాయనాన్ని ఎలా తయారు చేయాలనే విధానాన్ని నేర్చుకున్నట్టు తేలింది. గతంలో పాకిస్తాన్ వెళ్లి వచ్చిన నాసిర్ పేలుళ్లు ఏ విధంగా చేయాలి? ఏయే ప్రాంతాలు లక్ష్యంగా చేసుకోవాలనే విషయంలో తర్ఫీదు పొందినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. 

ఇదిలా ఉండగా ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో కోడ్ భాషలో సంప్రదింపులు జరిపినట్టు ఎన్‌ఐఎ అధికారుల విచారణలో బయటపడింది. పేలుళ్ల కేసులోని నిందితులు ఇంట్లోనే ఐఇడి ద్రావణాన్ని తయారు చేసి వస్త్రాల మధ్య ఉంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్‌లో ఇచ్చినట్లు ఎన్‌ఐఎ దర్యాప్తులో తేలింది. 

దాదాపు 55 కిలోల బరువున్న చీరల పార్సిల్ మధ్యలో పేలుడు స్వభావం ఉన్న రసాయన సీసాను ఉంచి పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కొన్నింటిని ఎంపిక చేసుకొని వాటిలో సికింద్రాబాద్, దర్భంగ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ముందుగానే పార్శిల్ ఎలా చేయాలి? ఏ విధంగా తరలించాలనే అనే అంశంపై రెక్కీ నిర్వహించి ఆ తర్వాత పథకాన్ని పక్కాగా అమలు చేసినట్లు విచారణలో తేలింది.