టిఎంసి ఎంపీ నుస్రత్ జహాన్ రాజీనామాకు బీజేపీ పట్టు 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ భారతీయ సంస్కృతిని అవమానించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే ఆమెను పదవి నుంచి తొలగించాలని టీఎంసీని ఆయన కోరారు.

నుస్రత్ జహాన్ ఓ మహిళా ఎంపీ అని, ఆమె నుదుటన బొట్టు పెట్టుకుని, ఓ వ్యక్తిని తన భర్తగా పేర్కొన్నారని దిలీప్ ఘోష్ గుర్తు చేశారు. వివాహ విందు అని చెప్పి ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇప్పుడేమో తనకు ఆ వ్యక్తితో పెళ్లి కాలేదని చెప్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆమె భారతీయ సంస్కృతిని అవమానించారని మండిపడ్డారు. 

మరోవైపు ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య మంగళవారం లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్‌ తన వైవాహిక హోదా గురించి పార్లమెంటుకు తప్పుడు ప్రమాణ పత్రాన్ని సమర్పించారని తెలిపారు. ఆమెను ఆ పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని కోరారు. 

నుస్రత్ జహాన్ జూన్ 9న విడుదల చేసిన ప్రకటనలో తనకు నిఖిల్ జైన్‌తో వివాహ బంధం దెబ్బతిన్నట్లు తెలిపారు. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ వివాహ నిబంధనల ప్రకారం టర్కీలో జరిగిందని, దానిని భారత దేశంలో రిజిస్ట్రేషన్ చేయించలేదని, అందువల్ల తమ వివాహం భారత దేశంలో చెల్లుబాటు కాదని వివరించారు. 

ఆమె బసీర్‌హట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నిఖిల్ జైన్‌తో వివాహం జరిగినట్లు ప్రకటించారు. టర్కీలో వివాహమైందని చెప్తూ, కోల్‌కతాలో విందు ఇచ్చారు. ఈ విందుకు మమత బెనర్జీ హాజరయ్యారు.