తిరిగి ప్రధానిగా నరేంద్ర మోదీకే జనం వోట్!

దేశానికి  తదుపరి ప్రధాన మంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు? అంటూ ‘ప్రశ్నమ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీకే మరోమారు జనం పట్టం గట్టారు.  దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 20 వేల మంది ఓటర్లపై సర్వే నిర్వహించగా, మోదీ అందరికంటే అత్యంత ప్రజాదరణ గల నేతగా అగ్రగామిగా నిలిచారు. 
 
ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్​తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీలు, కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల నేతలతోనూ చర్చల నేపథ్యంలో మళ్లీ తృతీయ కూటమి ఏర్పాటు కాబోతోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి తదుపరి ప్రధాన మంత్రిగా ఎవరైతే బాగుంటుందంటూ ప్రశ్నమ్ సర్వే నిర్వహించింది. 
 
ఇందులో ప్రధాని మోదీకి దరిదాపుల్లో మరే నాయకులు లేరని వెల్లడైనది. నరేంద్ర మోదీని 32.8 శాతం మంది జైకొట్టగా,  ఆయనకు ప్రత్యామ్న్యాయంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 17.2 శాతం మంది ఓకే చెప్పారు. 
ప్రాంతీయ పార్టీల కూటమిగా తృతీయ కూటమి ఏర్పాటు చేసి, ప్రధాని పదవికి పోటీ పడాలని ఆసక్తి చూపుతున్న ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవ్వరు దరిదాపులలో లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు తృతీయ కూటమిగా ఏర్పడినా ప్రధాని మోదీని ఎదుర్కోగల ధీటైన నాయకులు మరెవ్వరు లేరని ఈ ఈ సర్వే స్పష్టం చేసింది.

నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల తర్వాత ప్రధాని అభ్యర్థిగా  ప్రచారం పొందుతున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి 7 శాతం మంది మాత్రమే సర్వేలో ఓటేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు 6.1 శాతం మంది ఓకే చెప్పారు. 
 
తమిళనాడు సీఎం స్టాలిన్​కు 3 శాతం,  అఖిలేశ్​ యాదవ్​కు 2.2 శాతం  ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు 2.1 శాతం, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్​కు 1.5 శాతం, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్​కు 1.4 శాతం మంది మొగ్గుచూపారు. 
 
తృతీయ కూటమి అంటూ హడావుడి చేస్తున్న శరద్ పవార్ పట్ల 1 శాతం కూడా మొగ్గు చూపక పోవడం గమనార్హం. శరద్ పవార్, కేంద్ర మంత్రి అమిత్ షాకు 0.9 శాతం, కర్నాటక సీఎం యెడియూరప్పకు 0.8 శాతం,  జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​కు 0.5 శాతం ఓట్లు వచ్చాయి. తదుపరి ప్రధాని అభ్యర్థిగా సీఎం కేసీఆర్​ పట్ల 0.7 శాతం మంది మాత్రమే మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైంది.