ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్రంలో దుమారం రేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రాజెక్టులు ద్వారా రాష్ట్రంలో ఉపాధి వస్తుందంటే అందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టరని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన అంటే కానుకలు ఇవ్వడం, అప్పులు తేవడమేనని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.
కొత్త అప్పులు కోసం విశాఖను తాకట్టు పెడుతున్నారని అంటూ దేశంలో ఎక్కడ ఇటువంటి పరిపాలన చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ నేత అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని సోమువీర్రాజు స్పష్టం చేశారు. అశోక్ గజపతిరాజు కుటుంబస్యభ్యులు అనేక దానధర్మాలు చేశారని కొనియాడారు.
ఆయనపై విమర్శలు చేసినప్పుడు వారి స్థాయిని దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేయాలని ఆయన వైసిపి నేతలకు హితవు చెప్పారు. పరిపాలన చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్న అస్తవ్యస్థ పరిపాలనను సరి చేయాలని స్పష్టం చేశారు.
కడప జిల్లాల్లో వైసిపి నేతలు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని వీర్రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్పై భారతీయ యువమోర్చా అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన ప్రకటించారు. విశాఖలో భూ కబ్జాలుపై హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
More Stories
మోదీ పథకాలకు స్టిక్కర్ లతో జగన్ మోసం
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి