సైబర్ దాడులతో కేంద్ర ప్రభుత్వ ఈ-మెయిల్స్‌కు ముప్పు లేదు 

సైబర్‌ దాడులతో కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఈ-మెయిల్స్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) పర్యవేక్షించే ఈ-మెయిల్‌ వ్యవస్థ సురక్షితంగా ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డొమినోస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఈ-మెయిల్స్‌, పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల బారినపడినట్లు వచ్చిన వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ-మెయిల్‌ వ్యవస్థ అత్యంత సురక్షితమైందని వెల్లడించింది.

ఇతర వెబ్‌సైట్లపై జరిగే సైబర్‌ దాడులు ప్రభుత్వ ఈ-మెయిల్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపవని చెప్పింది. ఆయా వెబ్‌సైట్లలో నమోదు చేసుకున్న ఈ-మెయిల్‌, ప్రభుత్వ ఈ-మెయిల్‌ అకౌంట్లు పాస్‌వర్డ్‌లు ఒకటే అయినప్పుడు మాత్రమే ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపింది.

అయితే, ఇలాంటి దాడులకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌లు మార్చుకునేలా ఈ-మెయిల్‌ వ్యవస్థ రూపొందించామని పేర్కొంది. ఎన్‌ఐసీ ఈ-మెయిల్‌ పాస్‌వర్డ్‌లో ఏదైనా మార్పునకు మొబైల్‌ ఓటీపీ అవసరమని, ఓటీపీ తప్పుగా ఉంటే పాస్‌వర్డ్‌ మార్పు సాధ్యం కాదని చెప్పింది.

దీంతో ఈ మధ్య జరిగిన సైబర్‌ దాడులతో ప్రభుత్వ ఈ-మెయిల్స్‌ వ్యవస్థకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది. గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై చైనా హ్యాకర్లు సైబర్‌దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలను హ్యాకర్లు తస్కరించినట్లు సమాచారం. ఇందులో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. అయితే, వీరిలో కేంద్ర ప్రభుత్వ అధికారుల వివరాలు కూడా ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీశాఖ వివరణ ఇచ్చింది.