సోషల్‌ మీడియాలో ‘సీఐడీ’ సునీల్‌ వీడియోలు మాయం!

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌పై మహారాష్ట్రకు చెందిన లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం (ఎల్‌ఆర్‌పీఎఫ్‌) మరోసారి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది.
 
హిందువులకు వ్యతిరేకంగా, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో సునీల్‌ వీడియోలు, పోస్టింగులు పెట్టారని.. కేంద్రానికి తాము ఫిర్యాదు చేయగానే వాటన్నిటినీ ఆయనే తొలగించారని ఫోరం ప్రతినిధి సంతోష్‌ గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
 ఏపీ సీఐడీ చీఫ్‌ హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ, మతమార్పిడిలను ప్రోత్సహిస్తూ బడుగు, బలహీనవర్గాల మధ్య మత చిచ్చుపెడుతున్నారంటూ ఎల్‌ఆర్‌వో విభాగం కన్వీనర్‌ వినయ్‌ జోషి బుధవారం కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 
 ఫిర్యాదు చేసిన వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి హిందూ వ్యతిరేక పోస్టింగులు, వీడియోలను సునీల్‌కుమార్‌ మాయం చేశారని.. దీనిపై గురువారం కేంద్ర హోం కార్యదర్శికి మళ్లీ ఫిర్యాదు చేసినట్లు సంతోష్‌ వెల్లడించారు. 
 
తాము ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సునీల్‌కుమార్‌ సామాజిక మాధ్యమాల్లో తన వివాదాస్పద పోస్టింగులన్నీ తొలగించడాన్ని ఎల్‌ఆర్‌పీఎఫ్‌ తీవ్రంగా పరిగణిస్తోందని సంతోష్‌ స్పష్టం చేశారు.