5 ఏళ్ల లోపు చిన్నారులు మాస్క్ అవసరం లేదు

కరోనా సెకండ్ వేవ్ కు యువకులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో చిన్నారులపై కూడా ఈ ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా ఉండడానికి చిన్నారులు మాస్క్‌లు ధరించ వచ్చా ? దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది.

కేంద్ర ఆరోగ్యశాఖ పరిధి లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్‌యస్ ) ప్రకారం 5 ఏళ్ల లోపు చిన్నారులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. 4-11ఏళ్ల మధ్య వయసు పిల్లలు మాస్క్‌లను సురక్షితంగా వాడగలిగే సామర్థాన్ని బట్టి ధరించ వచ్చు. తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో ఈ వయసు పిల్లలు మాస్క్‌లు ధరించడం మంచిది.

ఇక 12-17 ఏళ్ల వయసున్న వారు మాత్రమే పెద్దవారి మాదిరిగా తప్పకుండా మాస్కులు ధరించాలి. మాస్క్‌లను వాడే సమయంలో చేతులను సబ్బుతో కడుక్కోవడం, లేదా శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవడం తప్పనిసరి. పిల్లలు మాస్క్‌లు ధరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే మార్గదర్శకాలు వెల్లడించింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని సూచించింది. అయితే సురక్షితంగా వినియోగించ గలిగిన సామర్ధంపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దగ్గరగా వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో మాత్రం మాస్కును వాడాలని సూచించింది. ఇక అమెరికా లోని వ్యాధుల నియంత్రణ కేంద్రం (సిడిసి) మాత్రం కేవలం రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు మాత్రమే మాస్కులు వాడకూడదని పేర్కొంది.

కాగా, చిన్న పిల్లలు కొవిడ్ బారిన పడితే వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స అందించడంపై డిజిహెచ్‌యస్ తాజా మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. కరోనాకు గురైన 18 ఏళ్ల లోపు పిల్లల ఊపిరితిత్తుల పరిస్థితులను తెలుసుకోడానికి హై రిజల్యూషన్ సీటీ స్కాన్ (హెచ్‌ఆర్‌సిటి) ను అంతగా వినియోగించాల్సిన పనిలేదని, అత్యవసరమైతే దీనిని హేతుబద్ధంగా ఉపయోగించాలని సూచించింది. 

అంతేకాకుండా అత్యవసరంగా వినియోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలే ఇవ్వరాదని స్పష్టం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, వంటి జాగ్రత్తలు పిల్లలు తప్పనిసిరిగా పాటించాలని సూచించింది.