అమెరికాలో వివక్షతను ఎదుర్కొంటున్న భారత్- అమెరికన్లు!

అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షత ఉంది. ఈ వివక్ష కారణంగా ఎంతో మంది నల్ల జాతీయులు.. శ్వేత జాతీయుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటువంటి ఘటనలను ఎప్పటికప్పుడు ఆ దేశాధినేతలు ఖండిస్తున్నప్పటికీ అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి భారత్ – అమెరికన్లు అతీతమేమీ కాదు. 
అమెరికాకు వలస వెళుతున్న బృందాల్లో భారత్‌-అమెరికన్లది రెండవ స్థానం. బైడెన్‌ పాలనా యంత్రాంగం కూడా భారత్ – అమెరికన్లను పెద్ద పీట వేస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు, పోలరైజేషన్‌కు గురౌతున్నారని తాజాగా  విడుదల చేసిన సర్వేలో తేలింది. 
 
గత సంవత్సర కాలంగా ఇద్దరు భారతీయుల్లో ఒకరు వివక్షకు గురవుతున్నారని ఈ వాస్తవాలు ‘ఇండియన్‌ అమెరికన్ల సోషల్‌ రియాలిటీస్‌ : 2020 ఇండియన్‌ అమెరికన్‌ యాటిట్యూట్‌ సర్వే’ నివేదికలో వెలుగు చూశాయి. కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌, జాన్స్‌ హాప్కిసన్‌-ఎస్‌ఎఐఎస్‌, పెన్సిల్వేనియా విశ్వవిద్యాయలంపై సమన్వయంతో ఇండియన్‌ అమెరికన్‌ యాటిట్యూట్‌ ఈ సర్వే (ఐఎఎఎస్‌)ను చేపట్టారు. 
 
సెప్టెంబర్‌ 1 నుండి సెప్టెంబర్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో చేపట్టిన ఈ సర్వేలో 1200 మంది భారత సంతతి అమెరికన్లు పాల్గొన్నారు. దీని ఫలితాల్లో క్రమంగా భారత అమెరికన్లు వివక్షను ఎదుర్కొంటున్నారని, గత సంవత్సరంలో ఇద్దరు ఇండో-అమెరికన్లలో ఒకరు చర్మ రంగు ఆధారంగా వివక్షకు గురౌతున్నారని తేలింది. 
 
మరో ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే భారత్‌లో పుట్టి అమెరికాకు వెళ్లిన వారి కంటే, అమెరికాలో పుట్టి అక్కడే పెరుగుతున్న భారత అమెరికన్లు వివక్షకు ఎక్కువగా గురౌతున్నారని నివేదిక పేర్కొంది. అదేవిధంగా ఇండో-అమెరికన్లు తమ సమాజంలో అంటే భారత సంతతి వ్యక్తులను వివాహం చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారని తెలిపింది.
 
వీరి జీవితాల్లో మతం ప్రధాన పాత్ర పోషిస్తుందని సర్వేలో తేలింది. భారత అమెరికన్లలో దాదాపు మూడొంతుల మంది తమ జీవితంలో మతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అంగీకరించినప్పటికీ, దానికి సంబంధించిన ఆచారాలు తక్కువగా పాటిస్తున్నారని తేలింది. 40 శాతం మంది రోజుకు ఒక్కసారి ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తుంటే, 27 శాతం మంది మతపరమైన కార్యక్రమాలకు హాజరు అవుతున్నారని తెలిపింది.