తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 కు పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న సంబంధిత ఫైలుపై ఆయన బుధవారం సంతకం చేశారు.
జడ్జీల సంఖ్యను ఏకంగా 75% పెంపుదల చేశారు. వీరిలో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు, మిగిలిన పది మంది అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు. 42 మందిలో 28 మంది బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులను ఎలివేషన్ చేస్తారు. మిగిలిన 14 మందిని జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఎంపిక చేస్తారు.
ఈ నిర్ణయం ఈ నెల 8 నుంచే అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. 2019 ఫిబ్రవరి 13న హైకోర్టు ప్రధాన నాయమూర్తి, తర్వాత గవర్నర్, సీఎం కేసీఆర్ న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కేంద్రప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రులు కూడా సమ్మతి తెలిపారు.
జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించారు. తెలంగాణ హైకోర్టు ప్రతిపాదనకు కేంద్రం న్యాయశాఖ ఈ ఏడాది మే 27న ఆమోదం తెలిపి, ఈ నెల 7న సీజేఐకి ఫైలు పంపింది.
ఫైలు అందిన వెంటనే జడ్జిలను నియమిస్తూ సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను పెంచి, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తేనే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ప్రస్తుతం పెండింగులో ఉన్న 2.46 లక్షలకు పైగా కేసుల పరిష్కారానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైకోర్టులో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. సీజేఐ ఆమోదానికి అనుగుణంగా కేంద్రన్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నది. జడ్జిల పెంపు నిర్ణయంపై బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్థన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ
రేవంత్రెడ్డి, కేసీఆర్ వీణా వాణిలాగా అవిభక్త కవలలు