విశ్వవిద్యాలయాలు ఉత్కృష్టత నిలయాలుగా ఎదగాలి 

విశ్వవిద్యాలయాలు ఉత్కృష్టత నిలయాలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్ లకు సూచించారు.విశ్వవిద్యాలయాలు కేవలం  ‘టీచింగ్ యూనివర్సిటీలు’ గా మాత్రమే మిగలకూడదు. అవి పరిశోధన, ఆవిష్కరణ ల  నిలయాలుగా ఎదగాలని గవర్నర్  స్పష్టం చేశారు.

గ్లోబల్ ఇన్నొవేషన్  లో భారతదేశం 49 వ స్థానంలో ఉందని, అయితే టాప్ ట్వంటీ లోకి భారత్ ను తీసుకురావాలంటే విశ్వవిద్యాలయాలు కూడా పరిశోధనల్లో, ఆవిష్కరణల్లో మరింత చురుకుగా వ్యవహరించాల్సి ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు.కోవిడ్ సంక్షోభానికి సంబంధించి సైన్స్, సామాజిక శాస్త్రాల ఉమ్మడి పరిశోధన కూడా సాగాలని ఆమె సూచించారు.

గవర్నర్ రాష్ట్రంలోని మొత్తం 14 విశ్వవిద్యాలయాల  వైస్ ఛాన్స్లర్ లతో వర్చువల్ గా సమావేశం నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత విద్యలో మరింతగా అభివృద్ధి చేసి నంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని  పిలుపునిచ్చారు.

విశ్వవిద్యాలయాలలో అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంపొందించడం,  పరిశోధనలను ప్రోత్సహించడం,  విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, యూత్ రెడ్ క్రాస్, ఎన్ ఎస్ ఎస్ సేవలు మరింత విస్తరించడం, గ్రామాల దత్తత ఇలాంటి అంశాలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.

విశ్వవిద్యాలయాలు సకాలంలో క్లాసులు,  పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి  అకాడమిక్ సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.ఆన్లైన్ క్లాసులు పొందలేక పోతున్న అణగారిన వర్గాలకు ప్రత్యేకమైన  సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. 

ఆన్ లైన్ విద్య డిజిటల్ అంతరాలను పూడ్చెది గా  ఉండాలి,  కానీ మరింత గా అంతరాలను పెంచేదిగా ఉండకూడదని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్స్లర్ లు తమ  యూనివర్సిటీ ల కార్యక్రమాలను, ప్రగతిని గవర్నర్ కు వివరించారు.

ఈ వర్చువల్ సమీక్షలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి,  వైస్ చైర్మన్ లు ప్రొఫెసర్   ఆర్ లింబాద్రి, కే వెంకటరమణ లో పాల్గొన్నారు. గవర్నర్ కార్యదర్శి కె సురేంద్రమోహన్ ఈ సమావేశాన్ని సమన్వయం చేశారు.