కేసీఆర్ వైఫల్యాలపై ఉద్యమాలు చేపట్టండి

ఒకవైపు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు చేపట్టాలని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్‌ఛుగ్‌ పార్టీ నేతలకు నిర్దేశించారు. గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ అధ్యక్షతన జరిగిన  ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలకు పిలుపిచ్చారు. 

రైతులు, నిరుద్యోగుల సమస్య తదితర అంశాల్లో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో గుర్తించాలని ఆయన సూచించారు. జిల్లా, మండల, బూత్‌ స్థాయి కమిటీలు.. పన్నా ప్రముఖ్‌ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం, సంస్థాగతంగా కమిటీల నియామకం రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 

వీటిని ఆధారంగా చేసుకుని 2023 ఎన్నికలను రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటి కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీఆర్‌ఎస్తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సమాయత్తం కావాలని నేతలకు పిలుపునిచ్చారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు ఉండబోదని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తేల్చిచెప్పారు. ఆ ప్రచారం కేసీఆర్‌ సృష్టే అని ధ్వజమెత్తారు. తమ తదుపరి లక్ష్యం హుజూరాబాద్‌ ఉప ఎన్నికే అని చెప్పారు. ఈటెలకు సరితూగే వ్యక్తి టీఆర్‌ఎస్లో లేరని ఆమె స్పష్టం చేశారు.

కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఆయ న్ను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్‌ చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.  న్నారు. నిన్నటిదాకా కేబినెట్‌లో కీలక మంత్రిగా పనిచేసిన ఈటలకు భద్రత లేని పరిస్థితులు సృష్టించారని గుర్తు చేశారు. డబ్బా కొడితే మంచోళ్లు, లేకుంటే అవినీతిపరులుగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. 

ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకు ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని సంజయ్ స్పష్టం చేశారు.  పలువురు కీలక నాయకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈటెల రాజేందర్ ఈ నెల 14న బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు. 

కాగా,  ప్రభుత్వ భూములు విక్రయించాలని కేసీఆర్  ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సమీక్షించేందుకు పార్టీ తరఫున బండి సంజయ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. మేధావులు, రెవెన్యూ, ఆర్థిక రంగ నిపుణులు ఈ కమిటీలో ఉంటారని సంజయ్‌ తెలిపారు.