చైనాలో కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మరో కీలక రహస్యాన్ని భారత శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. 2012లోనే దక్షిణ చైనాలోని మొజియాంగ్ రాగి గని కేం,ద్రంగా కరోనా కుటుంబానికి చెందిన వైరస్ మనుషులకు వ్యాపించడం మొదలైందని వెల్లడించారు.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన సైంటిస్టు దంపతులు డాక్టర్ మనోలి రహాల్కర్, డాక్టర్ రాహుల్ బహుళీకర్లు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనాను లక్షణాలపరంగా పోలి ఉండే ‘ఆర్ఏటీజీ 13’ బీటా కరోనా వైర్సపై అధ్యయనం జరుపుతుండగా ఈవిషయాన్ని గుర్తించారు. ఇది హార్స్ షూ రకం గబ్బిలాలకు ఎక్కువగా సోకుతుంటుందని తెలుసుకున్న శాస్త్రవేత్తలు, గబ్బిలాల నుంచి మనుషులకు అది ప్రబలిన ఘటనల వివరాలను సేకరించడం మొదలు పెట్టారు.
పరిశోధనలో భాగంగా చైనాలోని మోజియాంగ్లో ఉన్న రాగి గనికి సంబంధించిన డాక్యుమెంట్లు వారికి లభించాయి. వాటి ప్రకారం అది ఓ మూసివేసిన గని. గబ్బిలాల రెట్టలతో నిండిపోయిన గని మైన్షాఫ్ట్ను శుభ్రం చేయడానికి ఆరుగురు వ్యక్తులను నియమించారు. రెట్టలను వారు తొక్కడంతో, అవి పొడిగా మారి అక్కడి గాలి కలుషితమైంది.
ఆ వ్యక్తులు కొన్ని రోజుల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుత కరోనా రోగుల్లో మాదిరిగా అప్పుడు వారిలో కూడా జ్వరం, దగ్గు, రక్తం గడ్డ కట్టడం వంటి లక్షణాలు కనిపించాయి. అలసట, నిమోనియాతో కూడా వారు బాధపడ్డారు. శ్వాసనాళాల్లో కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. చివరకు ఆ ఆరుగురిలో ముగ్గురు మరణించారు.
అయితే, వీళ్లు ఫంగస్ వల్లే మరణించారని డబ్ల్యూఐవీ డైరెక్టర్ డాక్టర్ షీ జెంగ్లీ తెలిపారు. అయితే ముగ్గురు కార్మికుల మరణాలకు ఫంగస్ కారణం కాదని, మరేదైనా ఉండొచ్చని పుణె దంపతులు అభిప్రాయపడ్డారు. అచ్చం కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వారి తరహాలోనే ఆ ఆరుగురిలోనూ అప్పట్లో జ్వరం, దగ్గు, రక్తం గడ్డకట్టడం, నీరసం, న్యుమోనియా, పల్మనరీ త్రాంబో ఎంబాలిజం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు.
‘చైనా కరోనా డాక్టర్’గా పేరొందిన పల్మనాలజిస్టు జోంగ్ నన్షన్ స్వయంగా గని కార్మికులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పరిశీలించి, వారికి సోకింది వైరల్ ఇన్ఫెక్షనే అని ధ్రువీకరించారని వివరించారు. దీంతో వారికి యాంటీ వైరల్ యాంటీ బయోటిక్ ఔషధాలతో చికిత్స కొనసాగిందని పేర్కొన్నారు.
ఈక్రమంలో పలువురిలో వైరల్ ఇన్ఫెక్షన్కు అదనంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా బయటపడిందని వెల్లడించారు. చివరకు ముగ్గురు గని కార్మికులు మృతి చెందారని చెప్పారు. నాడు ఆ కార్మికులకు చేసిన రేడియోలాజికల్, సీటీ స్కాన్ పరీక్షా నివేదికల ఫలితాలు ఇప్పటి కరోనా రోగుల ఇన్ఫెక్షన్ లక్షణాలకు పోలినట్టే ఉన్నాయని తెలిపారు.
ఈమేరకు వివరాలతో డాక్టర్ మనోలి రహాల్కర్, డాక్టర్ రాహుల్ బహుళీకర్ దంపతులు రూపొందించిన పరిశోధనా పత్రం 2020 మే నెలలో ఓ మెడికల్ జర్నల్లో ప్రచురితమైంది. వీరి వాదనను డ్రాస్టిక్ అనే పేరుగల నిపుణుల బృందం సమర్థించింది. కార్మికుల మృతికి ఆర్ఏటీజీ13 అనే గబ్బిలాల్లో కనిపించే వైరస్ కారణమని తెలిపింది. మృతుల నమూనాలపై డబ్ల్యూఐవీలో పరిశోధనలు జరిగాయని, అనంతరం అక్కడ నుంచి వైరస్ లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు