ప్రైవేటుకు టీకాల మళ్లింపుపై పంజాబ్ వెనుకడుగు 

టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు ప్రతిపక్షాలైన అకాలీదళ్, బిజెపి ఆరోపించడంతో వెనుకడుగు వేసింది.

18-44 సంవత్సరాల వయసువారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది.

రూ.400 వచ్చి టీకాను సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.1060కి అమ్ముతున్నదని, దానిని హాస్పిటల్స్ రూ.1560కి అమ్ముతున్నాయని అకాలీ నాయకుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ట్విట్టర్‌లో ఆరోపించారు.

కొవిడ్-19 సంక్షోభం ఆస‌రాగా మ‌హ‌మ్మారి పేరుతో దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ త‌హ‌త‌హ‌లాడుతోంద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌లు విధిగా ప్రైవేట్ ద‌వాఖానల వ‌ద్ద వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేసే ప‌రిస్థితి క‌ల్పిస్తోంద‌ని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.

ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను సాయంత్రానికి ఉపసంహరించుకున్నది. ఈ వ్యవహారాన్ని గమనించిన కేంద్ర సర్కారు మొత్తం టీకాల లెక్క తెలియజేయమని పంజాబ్ లోని అమరిందర్ సర్కారును ఆదేశించింది.

పంజాబ్ ప్ర‌భుత్వం ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు లాభాల‌కు వ్యాక్సిన్ల‌ను అమ్మడంపై హైకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దర్యాప్తు జ‌రిపించాల‌ని సుఖ్బీర్ సింగ్ బాద‌ల్ డిమాండ్ చేశారు.