ఆఫ్ఘనిస్తాన్‌లో పట్టు కోసం దృష్టి సారిస్తున్న చైనా 

అమెరికా, దాని మిత్రదేశాలు త‌మ‌ సైనిక దళాలను ఉపసంహరించుకుంటున్న నేప‌థ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తన ప్రభావాన్ని పెంచుకోవ‌డంపై చైనా దృష్టి సారించింది. ఆఫ్ఘాన్‌, పాక్ విదేశాంగ మంత్రుల‌తో భేటీ జ‌రిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మెరుగైన భద్రత, ఆర్థిక సహకారం కోసం ఇరుదేశాలు పిలుపునిచ్చాయి.

వ‌ర్చువ‌ల్ సమావేశం ద్వారా చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల‌ విదేశాంగ మంత్రులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ సమావేశంలో అమెరికన్ దళాల ఉపసంహర‌ణ‌ క్రమబద్ధమైన పద్ధతిలో జరగాలని అంగీకరించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రత, స్థిరత్వం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పేర్కొన్న‌ది. ఆఫ్ఘనిస్తాన్, పొరుగు దేశాల ప్రయోజనాలను పరిరక్షించడానికి మూడు దేశాలు చ‌ర్చ‌ల‌ను, సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణ‌యంచారు.

ఇదిలావుండగా, చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరత్వం ఆఫ్ఘనిస్తాన్ శాంతికి అవసరమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మనం ముగ్గురం కలిసి ఈ పనిని ఎలా సాధించగలం, ఉమ్మడి లక్ష్యాలను ఎలా సాధించగలం అనే అంశాల‌పై దృష్టిసారించాల‌ని చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి పునరుద్ధరణకు అక్కడ తొలుత రాజకీయ స్థిరత్వం అవసరమని ఆయన అభివర్ణించారు. ఈ స‌మావేశం జ‌రిగిన‌ట్లు ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స‌మాచార‌మిచ్చారు.

సెప్టెంబర్ 11 నాటికి ఆఫ్ఘానిస్తాన్ లోని తమ దళాలు ఆ దేశం విడిచి పెడతాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. ఇప్పటికే దళాల ఉపసంహరణ ప్రారంభమైనది. దీనిని అదను తీసుకొని, చైనా మద్దతుతో తాలిబన్లతో చేతులు కలిపి ఆఫ్ఘానిస్తాన్ లో మకాం వేయడం కోసం పాకిస్థాన్ ఎత్తుగడలు వేస్తున్నది.