మమతకు ప్రధాని `అనుమతి’ ఇవ్వనే లేదు!

యాస్ తుఫాన్ పై సమీక్ష సమావేశం నుంచి వెళ్లిపోవడానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి అనుమ తి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానితో సమీక్ష సమావేశానికి వస్తానని తొలుత అంగీకరించి, ఆ తర్వాత ఆమె ‘బాయ్‌కాట్‌’ చేశారని తేల్చి చెప్పింది. 

తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి ప్రధాని అనుమతి తీసుకునే వెళ్లానంటూ మమత చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని తెలిపింది. ఈ మేరకు మంగళవారం తొమ్మిది అంశాలతో కూడిన ఖండన కేంద్ర ప్రభుత్వ వర్గాల పేరిట విడుదలైంది. మమతతో వివాదం మొదలైన తర్వాత ఇది రెండో ఖండన కాగా, సీఎం మమత తీరును ఈసారి కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టాయి. 

ప్రధాని హెలికాప్టర్‌ దిగడానికి తన హెలికాప్టర్‌ను గాల్లోనే ఉంచేశారన్న మమత ఆరోపణపై స్పందించాయి. ప్రధాన మంత్రి ఎప్పుడు ఏ విమానాశ్రయంలో దిగాలన్నా ఇలాగే ఉంటుందని, ఆమే కాస్త ముందుగా రావాల్సి ఉందని తెలిపాయి. ప్రధాని కోసం తననే 20 నిమిషాలపాటు వేచి ఉండేలా చే శారన్న మమత ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టాయి. 

సమీక్షకు వస్తానని మమత తొలుత చెప్పారని, కానీ, సమావేశంలో ప్రతిపక్ష నేత, నందిగ్రామ్‌లో తనపై విజయం సా ధించిన బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిని చూసిన వెం టనే ఆమె తన మనసు మార్చుకున్నారని, సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారని ఆ వర్గాలు వివరించాయి. 

ఇక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఖిల భారత సర్వీసుల అధికారి అని, ఆయనను ఢిల్లీకి పిలిపిస్తూ ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగబద్ధమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సమర్థించుకున్నాయి. నిబంధనల ఉల్లంఘనకు చీఫ్‌ సెక్రటరీ పాల్పడ్డారని అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని మమతకు తెలుసునని తెలిపారు. 

ఆయనను రక్షించేందుకు ఆమెకు ఉన్న ఒకే ఒక ఆప్షన్‌ ఆయన రిటైర్మెంట్‌ మాత్రమేనని తెలిపాయి. అందుకే ఆయనతో పదవీ విరమణ చేయించారని అభిప్రాయపడ్డాయి.

ఇలా ఉండగా, ప్రజా సేవపై అహంకారం పైచేయి సాధించిందని, ప్రధానితో సమీక్షను మమత బహిష్కరించడానికి ఇదే కారణమని బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ వ్యాఖ్యానించారు. ప్రధానితో సమీక్షకు ముందు ఆమె తనకు ఫోన్‌ చేశారని, ఆ సమావేశంలో సువేందు అధికారి ఉండేటట్లయితే దానికి తాను హాజరు కానని స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు.