దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) చేపట్టిన సమ్మెకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. గురువారం జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోసారి డీఎంఈతో జూడాల చర్చలు జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ జీవోలో 15 శాతం స్టైఫండ్ పెంపుకు ఆమోదం తెలిపింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.
ఈ క్రమంలోనే సీనియర్ రెసిడెంట్లకు వేతనాలు రూ.70,000ల నుంచి రూ.80,500 వరకు పెరగనున్నాయి. అన్ని డిమాండ్లు నేరవేరక పోయినా, సీఎం కేసీఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందనతో ఆందోళన విరమిస్తున్నామని జూడాలు తెలిపారు.
ఓవైపు కరోనా సెకండ్వేవ్ విజృంభణ కొనసాగుతుండగా.. జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ బుధవారం సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా కరోనాయేతర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి, టిమ్స్, ఎంఎన్జే, నిలోఫర్, కింగ్కోఠి, ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. దాంతొ దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం స్టైఫండ్ పెంపుకు ఆమోద ముద్ర వేసింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ఈనెల రెండో వారంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు.
More Stories
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్