ఓటుకు నోటు కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఈడీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చార్జీషీట్‌ దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఈ ఛార్జీషీట్‌లో  పార్లమెంట్ సభ్యుడు ఎ  రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది.  ఛార్జ్‌షీట్‌లో రేవంత్‌తో పాటు వేం కృష్ణ కీర్తన్‌రెడ్డి, సెబాస్టియన్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుల పాత్ర గురించి కూడా ఈడీ పేర్కొంది. 

తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. సీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే ఫోరెన్సిక్‌ నివేదిక ధ్రువీకరించింది.

ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 2015 మే 31న నామినేటెడ్‌ ఎమ్మెల్యే సీఫెన్‌సన్‌కి అతని ఇంట్లోనే రూ. 50 లక్షలు ఆఫర్‌ చేస్తూ రేవంత్‌ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 

ఆ తర్వాత జరిపిన విచారణలో మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ వ్యవహరం వెలుగు చూసింది. దాదాపు ఆరేళ్ల పాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించి పక్కా ఆధారాలతో ఈడీ చార్జీషీట్‌ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందనే దానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపిన నేపథ్యాన్ని గతంలో దొరికిన వీడియోలను కూడా ఈ కేసులో ఆధారాలుగా సేకరించారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ డబ్బులు ఏవిధంగా వచ్చాయి.. ఎలా చేతులు మారాయి.. అన్నీ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని ఈడీ ప్రధాని నిందితుడిగా ఈడీ చేర్చింది.