
విదేశీ కంపెనీలు గుజరాత్కు క్యూ కడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మనదేశానికి 81.72 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) రాగా వీటిలో 37 శాతం గుజరాత్కు వెళ్లాయి. గత సంవత్సరంలో ఈ రాష్ట్రం 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3 మూడు కోట్ల కోట్లు) ఎఫ్డీలను రాబట్టింది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే వీటి విలువ 10 శాతం పెరిగిందని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర , కర్ణాటక వరుసగా 27 శాతం , 13 శాతం ఎఫ్డీఐలను ఆకర్షించడం ద్వారా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. వరుసగా నాలుగో సంవత్సరం కూడా గుజరాత్ ఎఫ్డీఐల విషయంలో మొదటి ర్యాంకును సాధించింది.
2020–-21లో గుజరాత్లో వచ్చిన పెట్టుబడులలో దాదాపు 94 శాతం కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నాయి. మన దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్డీఐలలో ఈ రెండు రంగాల వాటా 78 శాతం ఉంది.
డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) లెక్కల ప్రకారం గత ఏడాది మార్చి క్వార్టర్లో గుజరాత్ రూ.1.77 లక్షల కోట్ల విలువైన ఎఫ్డీఐలను రాబట్టింది. అయితే ఈ క్వార్టర్ రాష్ట్రాల వారీగా ఎఫ్డీఐ ఇన్ఫ్లో డేటా ఇంకా అందుబాటులో లేదు. ఇదేకాలంలో మహారాష్ట్ర రూ 1.53 లక్షల కోట్ల ఎఫ్డీఐలను సాధించింది. కర్ణాటక రూ 78,160 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి మూడవ స్థానంలో ఉంది.
ఇతర రాష్ట్రాలకు ఎఫ్డీఐలు
- ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి -డిసెంబర్ మధ్య రూ.59,830 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.ఏడవ , ఎనిమిదవ స్థానాల్లో నిలిచిన తమిళనాడు, జార్ఖండ్ వరుసగా రూ .19,734 కోట్లు, రూ .19,200 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
- హర్యానా రూ.13,661 కోట్ల రూపాయల ఎఫ్డీఐలను సాధించగా, తెలంగాణకు రూ .11,332 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ .4,309 కోట్లు, యూపీకి రూ .4,103 కోట్లు వచ్చాయి.
- అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం ఎఫ్డీఐలను 20 శాతం పెంచుకోగలిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరోనా సమస్యలు ఉన్నప్పటికీ, ఇప్పటికే 10 శాతం వృద్ధిని సాధించింది.
- సింగపూర్ 29 శాతం ఎఫ్డీఐలతో భారత్ లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన దేశంగా ఉంది. తరువాతి స్థానాల్లో అమెరికా (23 శాతం), మారిషస్ (9 శాతం) ఉన్నాయి.
- ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ , హార్డ్వేర్, రబ్బరు వస్తువులు, రిటైల్ ట్రేడింగ్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ పరికరాల సెగ్మెంట్లలో ఎఫ్డీఐ లు 2020–-21 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 100 శాతానికి పైగా పెరిగాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సౌదీ అరేబియా నుంచి ఎక్కువ ఎఫ్డీఐలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 89.93 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయగా ఈసారి వీటి విలువ 2,816.08 మిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా, బ్రిటన్ కంపెనీల పెట్టుబడులు కూడా గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి.
- తాజా నివేదిక ప్రకారం, 2020 లో ప్రపంచ ఎఫ్డీఐ మార్కెట్ కుప్పకూలింది, 2019 లో 1.5 ట్రిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా, 2020లో ఇవి 42 శాతం తగ్గి 859 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 1990 తరువాత ఇంత తక్కువగా ఎఫ్డీఐలు రావడం ఇదే మొదటిసారి.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం