సీబీఐ కేసులో మమతా…. బెంగాల్ బైటకు బదిలీకై సిబిఐ 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వల్లే సీబీఐ కార్యాలయంపై తృణమూల్ పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని సీబీఐ కోల్‌కతా హైకోర్టుకు వివరించింది. నారదా కేసును రాష్ట్రం వెలుపల విచారించేలా కేసు బదిలీకి అనుమతివ్వాలని, అరెస్టయిన నలుగురు నిందితులనూ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ బుధవారం కోర్టును కోరింది.

మరోవంక కోర్ట్ విచారణను గురువారంకు వాయిదా వేయడంతో అరెస్ట్ అయినవారి బెయిల్ విషయం తేలలేదు.  సిబిఐ కార్యాలయం వద్ద స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేలాదిమంది అనుచరులతో బైఠాయింపు జరపడంను “అసాధారణ పరిస్థితి”గా హైకోర్టు అభివర్ణించింది. రాష్ట్రంలో `చట్టబద్ధ పాలనా’ ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. 
భువనేశ్వర్ హైకోర్ట్ కు బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నది. సిబిఐ కేసులో తమ కార్యాలయం ఎదుట రెండు, మూడు వేలమంది కార్యకర్తలతో బైఠాయింపు జరిపి, తమ దర్యాప్తుకు ఆటంకం కలిగించిన ముఖ్యమంత్రి మమతా బనెర్జీకి, అరెస్ట్ అయిన వారి బెయిల్ పిటిషన్ ల విచారణ సందర్భంగా కోర్ట్ వద్దనే ఉన్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ,మోలోయ్ ఘటలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. 
 
నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో సోమవారం  క్రితం సీబీఐ ఇద్దరు మంత్రులతో సహా నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు స్థానిక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయడంతో, వెంటనే సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. దాంతో నిందితుల బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది.

సీబీఐ ఆఫీసు ముందు ముఖ్యమంత్రి అధ్వర్యంలో తృణమూల్ కార్యకర్తలు భయోత్పాతం సృష్టించడం వల్లే సోమవారం కోర్టుకు వచ్చి నిందితుల కస్టడీని కోరలేకపోయామని సీబీఐ వివరించింది. భారీ గుంపులను తీసుకొని వచ్చిన మమత సీబీఐ ఆఫీసు ముందు నానా రచ్చ చేశారని ఆరోపించింది. ఆమె రెచ్చగొట్టడం వల్లే వేలాది మంది దుండగులు సీబీఐ ఆఫీసుపైకి రాళ్లు విసిరారని పేర్కొంది.

సీబీఐ అధికారులను బెదిరించి, భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించింది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా మమత సర్కార్ అడ్డుకుంటోందని ఆక్షేపించింది. అలాంటి సందర్భంలో నిందితులను కోర్టుకు తీసుకొస్తే  దారి మధ్యలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తొచ్చన్న ఉద్దేశంతోనే సోమవారం కోర్టుకు రాలేదని సీబీఐ పేర్కొంది.