కరోనా దుష్ప్రభావంలోనూ సంక్షేమం కొనసాగింపు 

ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించామని,  ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశామని ఆంధ్ర ప్రదేశ్  గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు.
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచిందని తెలిపారు. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచిందని వెల్లడించారు. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు టీకాలు ఇచ్చామని, 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని గవర్నర్‌ పేర్కొన్నారు.
కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని గవర్నర్‌ భరోసా ఇచ్చారు. ప్రజలను కోవిడ్‌ నుంచి కాపాడుకోవడం కోసం సర్వశక్తులను వినియోగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలందరూ కోవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్యశీలో చేర్చామని, ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించామని వెల్లడించారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకే నేరుగా సాయం అందుతోందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 3 ప్రధాన ఇండస్ట్రియల్‌ కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు. విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టును ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో 6 పోర్టులు, 2 ఫిషింగ్‌ హార్బర్లను రెండు విడతల్లో అభివృద్ధి చేస్తామని గవర్నర్‌ వివరించారు.