సీఐడీ అడిషనల్ డీజీకి హైకోర్టు కోర్ట్ ధిక్కరణ నోటీసు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఉత్తరువులను అమలు పరచక పోవడంతో ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని స్పష్టం చేసింది. 

మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని  ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా,  సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. 

కాగా,  రఘురామ కృష్ణంరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీఐపీ స్పెషల్ రూములో ఆర్మీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రఘురామకు అయిన గాయాలపై నిన్న (మంగళవారం) నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. 

సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు సమాచారం. మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు  రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు.

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని  తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు బుధవారం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఇవాళ కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు  కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అధికారులు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు.