నేపాల్ ప్రధాని ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం

నేపాల్‌లో కేపీ శర్మ ఓలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ప్రశ్నిస్తూ నాలుగు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖల‌య్యాయి. శుక్రవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర‌ప‌తి విద్యా దేవి భండారి చెప్పిన వాక్యం చెప్ప‌కుండా రాష్ట్ర‌ప‌తిని అగౌరవ‌ప‌రిచార‌ని పిటిషన్లలో పేర్కొన్నారు. ఓలీ మళ్లీ ప్రమాణం చేయాలని పిటిషన‌ర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞ‌ప్తిచేశారు.

ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వం ఏర్పాటులో విఫ‌లం కావ‌డంతో మ‌ళ్లీ ఓలీకే రాష్ట్ర‌ప‌తి అవ‌కాశం క‌ల్పించారు. అందుకు అనుగుణంగా తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి ఓలిని రాష్ట్ర‌ప‌తి విద్యాదేవి భండారి శుక్రవారం ఆహ్వానించారు. 

ప్రమాణ స్వీకారం సంద‌ర్భంగా . రాజ్యాంగంలో పొందుప‌రిచిన‌ట్లుగా దేవుడు, దేశం, ప్రజల సాక్షిగా అనే ప‌దాన్ని రాష్ట్ర‌ప‌తి చెప్పారు. అయితే, ఈ వాక్యాన్ని చెప్ప‌కుండా ఓలి ప్ర‌మాణం పూర్తిచేశారు. 69 ఏండ్ల వ‌య‌సునున్న ఓలి మూడోసారి నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

నేపాల్ ప్ర‌ధానిగా శుక్ర‌వారం ఓలి చేసిన‌ ప్రమాణ స్వీకారం చట్టవిరుద్ధమని నాలుగు పిటిష‌న్ల‌లో పేర్కొన్నారు. అందువల్ల, ఓలి మళ్లీ ప్రమాణం చేసేట్లుగా ఆదేశించాల‌ని పిటిష‌న్‌దారులు కోర్టును కోరారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర‌ప‌తి గౌరవాన్ని దెబ్బతీయ‌డ‌మే అని వారు చెప్పారు. 

ఈ పిటిషన్లను సీనియర్ న్యాయవాదులు చంద్రకాంత్ గ్యవాలి, లోకేంద్ర ఓలి, కేశర్‌జంగ్ కేసీ, రాజ్‌కుమార్ సువాల్, సంతోష్ భండారి, నవరాజ్ అధికారి దాఖలు చేశారు.