ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కాగా, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. “కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నాం’’  అని మంత్రి వివరించారు.