రైతులకు పీఎం కిసాన్ నిధి రేపే విడుదల

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం క్రింద రైతులకు ఎనిమిదో విడత ఆర్థిక సహాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14న విడుదల చేస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది.

సుమారు 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.19 వేల కోట్లకు పైగా అందజేస్తారు. ఈ వివరాలను గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం క్రింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున శుక్రవారం విడుదల చేస్తారు.

ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ సందర్భంగా మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు రైతులతో మాట్లాడతారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.  pmindiawebcast.nic.in లేదా దూరదర్శన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించవచ్చు.

పీఎం కిసాన్ పథకం క్రింద చిన్నకారు, సన్నకారు రైతులు లబ్ధి పొందవచ్చు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ సొమ్మును రూ.2,000 చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.

మొదటి విడత సహాయాన్ని ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో, రెండో విడత సహాయాన్ని ఆగస్టు 1 నుంచి నవంబరు 30 మధ్య కాలంలో, మూడో విడత సహాయాన్ని డిసెంబరు 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ఇస్తారు.