సుప్రీంకోర్టు ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధం

సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రకటించారు. గురువారం జరిగిన జర్నలిస్టుల యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తానని పేర్కొన్నారు. 

రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలు అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశామని తెలిపారు. ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తమకు తెలుసని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇక నుంచి జర్నలిస్టులు కోర్టు కార్యకలాపాల కోసం ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదని స్పష్టం చేశారు. ఆ దృష్టితోనే ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని చెప్పారు. \

మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికి అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్‌లతో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే యాప్‌ను సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించిందని అభినందించారు.

సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొందవచ్చని చెప్పారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేదుకు గాను సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.