భీకరదాడులతో ఇజ్రాయిల్‌, గాజా  

భీకరదాడులతో ఇజ్రాయిల్‌, గాజా  
మిడిల్‌ ఈస్ట్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భీకరదాడులతో అటు ఇజ్రాయిల్‌, గాజా దద్దరిల్లుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లను ఉప్రయోగించగా.. గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు బుధవారం తెల్లవారు జామున వైమానిక దాడులు జరిపాయి. 
 
దాడుల్లో ఇప్పటి వరకు సుమారు 35 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడగా.. ఇజ్రాయెల్‌లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జెరూసలెంలోని అల్‌-అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్‌ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ హమాస్‌ ఉగ్రవాదులు.. సోమవారం సాయంత్రం 500కుపైగా రాకెట్లను ప్రయోగించారు.

దీంతో ఇజ్రాయెల్‌ బలగాలు గాజాపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు దుర్మణం చెందారు. పెద్ద ఎత్తున జనం గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కనీసం 16 మంది హమాస్‌ ముష్కరులు ఉన్నారని ఇజ్రాయెల్‌ బలగాలు పేర్కొన్నాయి. వైమానిక దాడులకు గాజాలో 13 అంతస్థుల భవనం కూలిపోయింది. మరో భవనం దెబ్బతింది. 

గాజా నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో తమ కమాండర్లు ముగ్గురు మరణించారని హమాస్‌ ఉగ్రవాద ముఠా పేర్కొంది. దాడుల ఘటనపై యూఎన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఇరుపక్షాలు హింసను ఆపాలని యూఎన్‌ మిడిల్‌ ఈస్ట్‌ ప్రతినిధి టోర్‌ వెన్నెస్లాండ్‌ సూచించారు.

హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన రాకెట్‌ దాడుల్లో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. ఇజ్రాయెల్‌ అష్కెలాన్‌ నగరంలో కేర్‌ టేకర్‌గా పని చేస్తున్న కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన చెందిన సౌమ్య మంగళవారం తన భర్తతో వీడియో కాల్‌ మాట్లాడుతోంది. ఈ సమయంలోనే ఆమె ఉంటున్న ఇంటిపై పడడంతో ఆమె మృతి చెందారు. 

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లాడ్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఉన్నతాధికారులు, న్యాయ అధికారుల సమావేశం అనంతరం నెతన్యాహు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 

1966లో ఇజ్రాయెల్ అరబ్బులపై సైనిక పరిపాలన ముగిసిన తరువాత.. ఇజ్రాయెల్‌లోని ఒక అరబ్ సమాజంపై అత్యవసర అధికారాలను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. హమాస్‌ ఉగ్రవాదులపై దాడుల తీవ్రతను పెంచాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ సైనిక చర్యతో గాజా ఉగ్రవాదులకు గట్టి దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఇకపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.