కరోనా … మూడో ప్రపంచ యుద్ధం కోసం చైనా జీవాయుధమే!

 ‘ప్రపంచం మీదకు చైనా వదిలిన జీవాయుధం కరోనా మహమ్మారి. లేకపోతే అన్ని దేశాల్లో మళ్లీమళ్లీ విజృంభించిన వైరస్‌ తన పుట్టినిైల్లెన చైనాలో మాత్రం ఒక్క నగరానికే ఎందుకు పరిమితమైంది? ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే చైనా ఒక్కటే ఎలా అంత వేగంగా వైరస్‌ను అడ్డుకోగలిగింది?’ 

కరోనా వ్యాప్తి మొదలైన కొన్ని రోజుల నుంచి ఇప్పటివరకు ప్రపంచం మదిని తొలిచేస్తున్న అనుమానం ఇది. ఈ అనుమానానికి బలం చేకూర్చే చైనా అధికారిక డాక్యుమెంట్‌ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వీకెండ్‌ ఆస్ట్రేలియన్‌ అనే మ్యాగజైన్‌ దానిని బయటపెట్టింది. కథనం ప్రసారం చేసింది. 

ఈ కథనం ప్రకారం కరోనా వైరస్‌ను జీవాయుధంగా మార్చి ప్రపంచ దేశాలపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందని ఆరేండ్ల క్రితం 2015లో చైనా శాస్త్రవేత్తలు చర్చించుకొన్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే కరోనా వైరస్‌ను జీవాయుధంగా ప్రయోగించాలని సూచించారు. జీవాయుధాల్లో కరోనా వైరస్‌ను ఓ కొత్త శకంగా వారు అభివర్ణించారు.

కరోనా మహమ్మారి వూహాన్‌లోని ఓ మార్కెట్‌లో బయటపడిందని చైనా తొలి నుంచి చెప్తున్నది. అందరూ నిజమనే నమ్మారు. అయితే చైనా చెప్పిన సమయం కన్నా ముందే కరోనా కేసులు వచ్చినట్టు బయటపడటం, వైరస్‌ గురించి చైనా ప్రపంచానికి ముందే సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. 

వైరస్‌ పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తునకు చైనా అనుమతినివ్వకపోవడం అనుమానాలను మరింత పెంచింది. అదే సమయంలో చైనా నుంచి పాకిన వైరస్‌ పశ్చిమదేశాల్లో మరణమృదంగం మోగిస్తుంటే చైనాలో కేసులు ఒక్కసారిగా పడిపోవడం అందరినీ విస్మయపర్చింది. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌ వైఖరితో ఆ దేశం ఆత్మరక్షణలో పడిన వేళ ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా ఈ జీవాయుధాన్ని వదిలిందని ఆరోపణలు ఉన్నాయి. 

అయితే, కరోనా వైరస్‌ను జీవాయుధంగా మార్చాలని ఆరేండ్ల కింద చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు చర్చించుకొన్నారంటూ ప్రసారమైన కథనాలు ‘పచ్చి అబద్ధం’ అని చైనా ఖండించింది. చైనాపై బురద జల్లడానికి అమెరికా అల్లిన కట్టుకథ అని ఆరోపించింది. ‘అమెరికా వందల సంఖ్యలో బయో ల్యాబ్‌లు నిర్వహిస్తున్నది. అంటే ఆ దేశం బయోవార్‌ కోసం పరిశోధనలు జరుపుతున్నదని భావించవచ్చా’ అని ప్రశ్నించింది.