హింస జరిగిన ప్రాంతాల్లో బెంగాల్ గవర్నర్ పర్యటన 

ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసల పై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు.

“నా రాజ్యాంగ విధిలో భాగంగా, నేను రాష్ట్రంలోని హింసాకాండ జరిగిన ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు. “ఈ మేరకు  ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయమని కూడా కోరాను. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు” అంటూ  అసహనం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం స్పందించకున్నా నేను తన  సొంత ఏర్పాట్లు చేసుకుని అనుకున్న ప్రకారమే పర్యటిస్తానని గవర్నర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఎంసీ సర్కార్‌కు జవాబుదారీతనం లోపించిందని ఆయన మండిపడ్డారు. 

ఫలితాల తరువాత, రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ప్రతీకార హింస, కాల్పుల చర్యలు, దోపిడీ వంటివి జరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కనుక వీటి పై తక్షణమే స్పందించకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి దయనీయంగా మారే అవకాశాలు ఉన్నట్లు ధన్‌ఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

 ప్రభుత్వం విశ్వసనీయతను పునరుద్ధరించి, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్న దుండగులను వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని సూచించారు.  ”మీ ఓటే మీ మరణానికి, ఆస్తుల విధ్వంసానికి కారణమైతే, ప్రజాస్వామం ముగిసిపోతోందనడానికి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది” అని ధన్‌కర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడుతూ, హింస చెలరేగిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితితో పాటు, పరిస్థితిని అదుపు చేసేందుకు తీసుకుంటున్నచర్యలపై నివేదక ఇవ్వాలని ఆదేశించినా రాష్ట్ర పోలీసులు నివేదిక ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.