అనంతపూర్ జిల్లాల్లో లోకేశ్‌పై క్రిమినల్‌ కేసు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదు చేసిన రెండు రోజులకే ఆయన  కుమారుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పొరుగున ఉన్న అనంతపూర్ జిల్లాలో మరో క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా రాయదుర్గం ఇన్‌చార్జ్‌ మారుతిపై కర్ణాటకలో జరిగిన దాడిని ఖండించిన ఘటనలో  లోకేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో వైసీపీ నాయకుడు వి భోజరాజనాయక్‌ ఫిర్యాదు మేరకు 153ఏ, 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అండతోనే మారుతిపై దాడి జరిగిందంటూ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కాపు రామచంద్రారెడ్డికి ఘటనను అంటగట్టి, ఆయన గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత, ద్వేషం కలిగిస్తూ, వైసీపీని రాజకీయంగా నష్టపరచడానికి కుట్ర పన్నినట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వలీబాషా తెలిపారు. 

కాగా, వైసీపీ దొంగల ముఠా నాయకులు పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.  కాపు రామచంద్రారెడ్డి కాపు ప్రోద్భలంతోనే మారుతిపై దాడి జరిగినట్లు తాము బలంగా నమ్ముతున్నామని తెలిపారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ 41 (ఏ) కింద నేడు (ఆదివారం) నోటీసులు ఇవ్వనున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప తెలిపారు. నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారిగా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ ఆధ్వర్యంలో అధికారుల బృందం వెళ్తుందని చెప్పారు. ఈ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.