ఆసుప‌త్రిలో చేరేందుకు పాజిటివ్ రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రికాదు

ఆసుప‌త్రిలో రోగుల అడ్మిట్‌కు క‌రోనా పాజిటివ్ రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగుల‌ను ఆసుప‌త్రిలో చేర్చుకోక‌పోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆసుప‌త్రిలో రోగుల అడ్మిష‌న్ నిబంధ‌న‌ల‌ను శ‌నివారం స‌డ‌లించింది. 

క‌రోనా సెకండ్ వేవ్‌తో దేశం పోరాడుతున్న ఈ క్లిష్ట స‌మ‌యంలో ఏ రోగిని కూడా ఆసుప‌త్రిలో చేర్చుకునేందుకు నిరాక‌రించ‌కూడ‌ద‌ని పేర్కొంది. రోగి మ‌రో ప్రాంతానికి చెందిన‌ప్ప‌టికీ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేసుకోవాల‌ని, ఆక్సిజ‌న్‌, అవ‌స‌ర‌మైన మందుల‌తో వైద్య చికిత్స అందించాల‌ని సూచించింది.

ఒక‌వేళ రోగికి క‌రోనా సోకి ఉంటుంద‌ని అనుమానంగా ఉంటే క‌రోనా వార్డు, లేదా కేంద్రంలో ఉంచి వైద్య చికిత్స అందించాల‌ని, ఆ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కాక‌పోతే ధ్రువీక‌ర‌ణ కోసం డిమాండ్ చేయ‌కూడ‌ద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

“ఆసుపత్రిలో ప్రవేశాలు తప్పనిసరిగా అవసరాన్ని బట్టి ఉండాలి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వ్యక్తులతో పడకలు ఆక్రమించకుండా చూసుకోవాలి. క‌రోనాతో బాధపడుతున్న రోగులకు సత్వర, సమర్థవంతమైన, సమగ్ర చికిత్సను అందించే ల‌క్ష్యంగా ఆసుప‌త్రులు ప‌నిచేయాలి ” అని ప్రకటనలో పేర్కొంది.

ఈ కొత్త నిబంధనలు అన్ని ప్రభుత్వ ఆసుప‌త్రుల‌తోపాటు ప్రైవేటు ఆసుపత్రులకు వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ వెల్ల‌డించింది. వీటిని మూడు రోజుల్లో అమ‌లు చేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్య‌ద‌ర్శులు ఆ మేర‌కు ఆదేశాలు, ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని సూచించింది.

కాగా, క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు మిస్ కావ‌ద్ద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్థ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. రెండో డోస్ వ్యాక్సిన్ త‌ర్వాతే క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,70,841 కరోనా రోగులు వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, 9,02,291 మంది రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్టుచెప్పారు. 

1.34 శాతం మంది ఐసీయూలో ఉండగా, 0.39 శాతం మంది రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, 3.70 శాతం మంది రోగులు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నట్టు మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా 4,88,861 మంది కొవిడ్ రోగులు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, 1,70,841 మంది వెంటిలేటర్లపైనా, 9,02,291 మంది ఆక్సిజన్ సపోర్ట్‌తోనూ ఉన్నట్టు మంత్రిపేర్కొన్నారు.