తెలంగాణలో వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ  అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు తగ్గడంపై అసహనం వ్యక్తం చేసింది. రోజుకు లక్ష కరోనా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
అలాగే వారాంతపు లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడగింపును ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు కోరింది.కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జిరగింది. ఈ విచారణకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వారాంతపు లాక్‌డౌన్, కర్ఫ్యూ వేళల పెంపు విషయంలో 8 తేదీ కంటే ముందు ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపై తాజా మార్గదర్శకాలను విడుదల చేయాలని సూచించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన విధంగానే వారంలోగా అన్ని జిల్లాల్లోనూ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఖైదీలు, నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో చెప్పాలని కూడా హైకోర్టు కోరింది. అయితే పెరంబుదూరు నుంచి ఆక్సిజన్ రాకుండా తమిళనాడు అడ్డుకుంటోందని డీహెచ్ శ్రీనివాస రావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది. చర్యలు తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని కేంద్రానికి సూచించింది. 

రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు తమకు సమర్పించాలని కోరింది. శ్మశాన వాటికలు, సదుపాయాల వివరాలు తమకు తెలపాలని సూచించింది.

శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50కి మించి పాల్గొనవద్దని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని, ఫంక్షన్ హాళ్లు, పార్కులు, మైదానాలలో ఆకస్మిక తనిఖీలు చేయాలని హైకోర్టు  ఆదేశించింది.