బెంగాల్ అసెంబ్లీ లోకి సాధారణ కూలి!

చందనా బౌరి.. పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ సాధారణ రోజు కూలీ. ఆమె భర్త కూడా రోజు కూలీనే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. అయితేనేం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాధించిన అపూర్వ విజయం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది.

బెంగాల్‌లోని సల్తోరా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ తరఫున బరిలోకి దిగిన చందనా బౌరి.. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి సంతోష్ కుమార్ మండల్‌పై 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. 

దీంతో ప్రముఖ రాజకీయ నాయకులు ఆమె విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది సామాన్య మహిళ విజయమంటూ నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. కరెంటు సదుపాయం కూడా లేని ఒక గుడిసె.. మూడు మేకలు.. మూడు ఆవులు.. తన పేరిట రూ.31,985, తన భర్త పేరిట రూ. 30,311.. ఇవే చందన అస్తుల వివరాలు. 

ఎస్సీ మహిళ అయిన చందనా బౌరి ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన తన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన చందన అనూహ్యంగా బీజేపీ నుంచి టికెట్ దక్కించుకుని చారిత్రాత్మక విజయం సాధించింది.

`నాకు టికెట్ వస్తుందని, నేను ఎన్నికలలో పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఎన్నికల్లో నిలబడమని నన్ను ఎంతో మంది ప్రోత్సహించారు. నాకు మద్దతుగా నిలిచేందుకు ఎంతోమంది స్వతహాగా ముందుకు వచ్చార`ని మార్చిలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

టికెట్ దక్కించుకోవడాన్నే పెద్ద విజయంగా భావించిన చందన.. ఇప్పుడు ఏకంగా తృణమూల్ కంచుకోటనే బద్దలుగొట్టారు. గత రెండు పర్యాయాలూ ఈ నియోజక వర్గంలో టీఎంసీనే గెలుపొందింది.