హైదరాబాద్ చేరుకున్న రష్యా టీకా  స్నుత్నిక్‌

రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్నుత్నిక్‌వి డోసులు రష్యా రాజధాని మాస్కో నుంచి తొలి కన్‌సైన్‌మెంట్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నాయి. భారత్‌తో ఒప్పందంలో భాగంగా మాస్కో నుంచి లక్షా 50 వేల డోసులు స్నుత్నిక్‌వి వ్యాకిన్లతో ఉన్న విమానం నేరుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. 

మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం.. మరోవైపు టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో స్నుత్నిక్‌వి టీకాలు భారత్ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్‌లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచారం. దేశీయంగా స్నుత్నిక్‌వికి సంబంధించిన క్లీనికల్ ట్రయల్స్‌ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చేపట్టిన సంగతి తెలిసిందే.

రష్యా నుంచి హైదరాబాద్ చేరుకున్న స్నుతిక్ వి టీకాలు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) సహకరాంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన స్నుత్నిక్ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్‌లో డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది.

అందులో భాగంగా.. రెండు, మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ దాదాపు 1600 మంది వాలంటీర్లపై నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్, అనుమతి కోసం డిసిజిఐకు దరఖాస్తు చేసుకుంది. వీటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్‌లో అత్యవసర వినియోగానికి ఏప్రిల్ 12న పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లు భారత్‌లో వినియోగిస్తున్న సంగతి విదితమే.

కాగా స్నుతిక్‌వి యొక్క సమర్థత ప్రపంచంలోనే అత్యధికంగా తేలింది. ఈ టీకా కోవిడ్ యొక్క కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రష్యా, భారతదేశం అంకితభావంతో ఉమ్మడి ప్రయత్నాలను కొనసాగిస్తున్నందున, కోవిడ్ సెకండ్ వేవ్‌కు బ్రేకులు వేసేందుకు, ప్రాణాలు కాపాడటానికి భారత ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఈ చర్యల చాలా ముఖ్యమని భారత్‌లోని రష్యన్ రాయబారి అంటున్నారు.

 కాగా మరో 30 లక్షల డోసులు ఈ నెలాఖరు నాటికి భారత్‌కు పంపించేందుకు రష్యా అంగీకరించింది. అనంతరం జూన్‌లో 50 లక్షల డోసులు, జులైలో కోటికి పైగా డోసులు భారత్‌కు రానున్నాయి.