శ్రీలంక బహిరంగ ప్రదేశాల్లో బురఖా  నిషేధం 

ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
2019లో ఈస్టర్‌ రోజున నేషనల్‌ తావీద్‌ జమాత్‌ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బురఖా ధరించి చర్చ్‌లు, హోటళ్లపై పేలుళ్లకు తెగబడి వందల ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘోరకలి ఒక్క శ్రీలంకనే కాదు.. యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 
 
శ్రీలంకలో జరిగిన ఈ వరుసల దాడుల్లో సుమారు 270 మందికి పైగా మరణించిగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు. అందుకే ఆ దేశ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులు ధరించరాదని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది. 
 
కేబినెట్‌ నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మారుతుంది. ఈ విషయాన్ని కేబినెట్‌ ప్రతినిథి రాంబుక్వెల్లా మీడియాకు తెలిపారు. అయితే, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.