ర‌ష్యా, అమెరికాల  నుంచి భారీగా వైద్య సామాగ్రి

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి అంత‌కంత‌కే పెరిగిపోతున్న‌ది. రోజూ ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దాంతో దేశంలోని ఆస్ప‌త్రుల‌న్నీ క‌రోనా బాధితుల‌తో నిండిపోతున్నాయి. రోగుల తాకిడి పెరుగుతుండ‌టంతో ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్‌తోపాటు, ఇత‌ర వైద్య సామాగ్రి కూడా నిండుకుంటున్న‌ది. 

ఈ నేప‌థ్యంలో పొరుగుదేశాల‌న్నీ భార‌త్‌కు స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ర‌ష్యా కూడా భార‌త్‌కు భారీగా వైద్య‌సామాగ్రిని పంపింది. ర‌ష్యా నుంచి 20 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు, 75 వెంటిలేట‌ర్లు, 150 బెడ్‌సైడ్ మానిట‌ర్లు, 22 మెట్రిక్ ట‌న్నుల ఔష‌ధాలతో బుధ‌వారం బ‌య‌లుదేరిన రెండు విమానాలు ఈ తెల్ల‌వారుజామున ఢిల్లీ విమానాశ్ర‌యానికి చేరుకున్నాయి.

 విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్‌లోడ్ చేయించిన అధికారులు అవ‌స‌ర‌మున్న వివిధ ఆస్ప‌త్రుల‌కు దాన్ని చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవంక, కరోనా వైరస్‌ విజృంభణతో కష్టకాలంలో ఉన్న భారత్‌కు సాయం కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఇందులో భాగంగా 100 మిలియన్‌ డాలర్ల విలువైన వైద్య సామగ్రిని భారత్‌కు పంపిస్తున్నామని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. వైద్య సామాగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న చర్యలకు సంబంధించి అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

‘కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్‌లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయంచేస్తాం. కరోనాకు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్‌కు బయలుదేరుతున్నాయి. ఈ ప్రక్రియ వారం రోజులపాటు కొనసాగుతుంది. వాటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, కోటీ 50 లక్షల ఎన్-95 మాస్క్‌లు, 10 లక్షల ర్యాపిడ్ కిట్లు ఉన్నాయి’ అని తెలిపారు. 

అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తయారీ సామగ్రిని భారత్‌కు పంపిస్తున్నామని, దీనిద్వారా రెండు కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను తయారు చేయవచ్చని తెలిపింది. కరోనాపై పోరులో భాగంగా యూఎస్‌ ఎయిడ్‌ కింద ఇప్పటికే నేరుగా కోటి మందికి సాయం అందించామని వెల్లడించింది. త్వరలో మరో వెయ్యి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందజేస్తామని పేర్కొంది.