అజిత్ దోవల్ సంతకం ఫోర్జరీ.. నకిలీ లేఖ వైరల్ చేసిన ప్రశాంత్ భూషణ్

మావోయిస్టు సానుభూతిపరుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్  సంతకం ఫోర్జరీ చేసిన ఒక నకిలీ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ప్రశాంత్ భూషణ్ తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక లేఖకు సంబంధించిన ఫోటో ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి  జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ రాసినట్టుగా పేర్కొన్న ఆ లేఖ అజిత్ దోవల్ లెటర్-హెడ్ తో పాటు ఫోర్జరీ చేసిన ఆయన సంతకాన్ని కూడా కలిగి వుంది.

అజిత్ దోవల్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శికి రాసినట్టుగా ప్రచారం చేసిన ఆ లేఖలో .. రాష్ట్ర పోలీస్, రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల మద్య సమన్వయంతో  కుంభమేళాను సమర్ధవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని అభినందించడంతో పాటు, రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతాన్ని రాష్ట్రంలో అమలు చేస్తారన్న నమ్మకాని వ్యక్తపరిచినట్టుగా పేర్కొనబడింది.

వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్ కలిగివున్న ప్రశాంత్ భూషణ్  ట్వీట్ చేసిన నకిలీ లేఖ కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యింది. అనేక మంది ఇది నిజమే అని భావించారు. కొందరు నకిలీ లేఖలు ట్వీట్ చేయడంపై ప్రశాంత్ భూషణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. చివరికి రెండున్నర గంటల అనంతరం సుమారు సాయంత్రం 6:30 ప్రాంతంలో  ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్ తానే తొలగించారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. బాధ్యతాయుతమైన సుప్రీంకోర్ట్ న్యాయవాదిగా ఉన్న ప్రశాంత్ భూషణ్ కనీసం నిజానిజాలు నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారం ఎలా వ్యాప్తి చేస్తారని సోషల్ మీడియాలో ప్రముఖులు మండిపడ్డారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దీనిపై అజిత్ దోవల్ కార్యాలయానికి సమాచారం అందించింది. ఆ లేఖను సృష్టించి, జాతీయ భద్రతా సలహాదారుని సంతకం ఫోర్జరీ చేసిన కుట్రలో వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ పోలీస్ సైబర్ నేర విభాగాన్ని కోరింది.

ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసులు ప్రశాంత్ భూషణ్ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్టు సమాచారం.