యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీటీ స్కాన్‌, ఇతర పరీక్షల కోసం సీఎం యశోద ఆస్పత్రికి వచ్చారు. అంతకుముందు ఆయనకు వ్యవసాయ క్షేత్రంలోనే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.

అయితే వైరస్‌ తీవ్రతను తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌ సహా ఇతర పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన యశోద ఆస్పత్రికి వచ్చారు. ప్రభుత్వ, పార్టీ వర్గాల సమాచారం మేరకు సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం పూర్తి స్థాయిలో నిలకడగా ఉందని తెలుస్తోంది. వైరస్‌ లక్షణాలు సైతం సాధారణంగానే ఉన్నాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు స్పష్టం చేశారు.

ఈ నెల 19న యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా సీఎంకు స్వల్పంగా కొవిడ్‌ లక్షణాలున్నట్లు తేలింది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష సైతం నిర్వహించగా.. అందులోనూ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి వైద్యుల సలహా మేరకు ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షల ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ నేరుగా వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు