లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు బెయిల్

ఆర్‌జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు బెయిల్ మంజూరీ అయ్యింది. దాణా కుంభ‌కోణం కేసులో ఆయ‌న‌కు ఇవాళ జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దుమ్‌కా ట్రెజ‌రీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ జైలుశిక్ష‌ను అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. 

గ‌తంలో జార్ఖండ్ రాష్ట్రం బీహార్‌లో ఉండేది. ఆ స‌మ‌యంలో సీఎంగా ఉన్న లాలూ ప్ర‌సాద్‌ యాద‌వ్‌.. అక్ర‌మ రీతిలో ప్రభుత్వ ఖ‌జానా నుంచి 3.13 కోట్లు కాజేశారు. ప్ర‌స్తుతం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య‌శాల‌లో చికిత్స పొందుతున్నారు. 

దాణా కుంభ‌కోణంలో భాగ‌మైన నాలుగు కేసుల్లో.. మూడింటిలో ఆయ‌న‌కు బెయిల్ గ‌తంలోనే మంజూరీ అయ్యింది. ఇక ద‌మ్‌కా కేసులో బెయిల్ ద‌క్కిన లాలూ.. త్వ‌ర‌లోనే ఇంటికి వెళ్ల‌నున్నారు. హాస్పిట‌ల్‌లో చికిత్స పూర్తి అయితే.. ఆయ‌న త‌న స్వంత రాష్ట్రానికి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.