తెలంగాణలో మినీ మునిసిపల్ పోరు!

తెలంగాణలో మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. మున్సిపల్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు, ఐదు మున్సిపాటిలీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
గ్రేటర్ ఖమ్మం, గ్రేటర్ వరంగల్ తో పాటు జడ్చర్ల, అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
 
 19న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. 22వ తేదీను నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.  ఈ నెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. మే 3న ఫలితాలను వెల్లడిస్తారు.  రేపటి నంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుండటం తో అన్ని పార్టీలు  ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 
 
దీంతోపాటు వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కు, గజ్వేల్, నల్గొండ, జల్పల్లి ,అలంపూర్, బోధన్ పరకాల, మెట్ పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
 
సిద్దిపేట పాలకమండలి పదవీకాలం ఈ రోజుతో ముగిసింది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.