సీబీఎస్ఈ 10 ప‌రీక్ష‌లు ర‌ద్దు, 12 ప‌రీక్ష‌లు వాయిదా

క‌రోనా కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసింది. 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను బోర్డు త‌యారు చేయ‌బోయే కొన్ని ప్ర‌మాణాల ఆధారంగా సిద్ధం చేయ‌నున్న‌ట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్ల నేప‌థ్యంలో ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌ధాని నరేంద్ర  మోదీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలోనే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌న్న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

కాంగ్రెస్ నేత‌లు రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌తోపాటు ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. జూన్ 1న బోర్డు అప్ప‌టి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను త‌ర్వాత నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

12 త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 4 నుంచి జూన్ 14 వ‌ర‌కూ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇప్పుడ‌వి వాయిదా ప‌డ్డాయి. ప‌రీక్ష‌లు తిరిగి నిర్వ‌హించే ముందు క‌నీసం 15 రోజులు ముందు నోటీసు ఇవ్వ‌నున్నారు.

ఇంటెర్న‌ల్ అసెస్‌మెంట్ ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ప్రమోట్ చేస్తామ‌ని విద్యా శాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ వెల్ల‌డించారు. ఒక‌వేళ ఎవ‌రైనా విద్యార్థి అసెస్‌మెంట్‌పై అసంతృప్తిగా ఉంటే ఆమె/అత‌డు ప‌రిస్థితులు మెరుగుప‌డిన త‌ర్వాత పరీక్ష‌లు రాయ‌వ‌చ్చ‌ని కూడా ఆయ‌న చెప్పారు.