స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ పచ్చజెండా

ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి క‌రోనా వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి నిపుణుల క‌మిటీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో భారత్ లో  ఆమోదం పొందిన మూడో క‌రోనా వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి నిలిచింది. ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన‌ కొవాగ్జిన్‌, సీర‌మ్ త‌యారుచేస్తున్న కొవిషీల్డ్‌ను వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే.

గ‌త వారం వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాల్సిందిగా డాక్ట‌ర్ రెడ్డీస్ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. దీంతో సోమ‌వారం డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల క‌మిటీ దీనిపై చ‌ర్చించ‌డానికి స‌మావేశ‌మైంది. ఆ వెంట‌నే వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి నిపుణుల క‌మిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఈ వ్యాక్సిన్‌ను భారత్ లో హైద‌రాబాద్‌కు చెందిన‌ డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ త‌యారు చేస్తోంది. ర‌ష్యాకు చెందిన గ‌మ‌లేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఎపిడ‌మాల‌జీ అండ్ మైక్రోబ‌యోల‌జీ దీనిని అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 91.6 శాతంగా ఉన్న‌ట్లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో తేలింది.