క‌రోనా సెకండ్ వేవ్‌ తో యువ‌త‌కే ప్రమాదం 

కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే క‌రోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది. మరి సెకండ్ వేవ్‌తో మొదటి దశలో మాదిరి కేవలం వృద్ధులకే ఎక్కువ ప్రమాదమా.. అంటే కాద‌నే చెప్పాలి. 
 
సెకండ్ వేవ్‌తో యువ‌తకే ఎక్కువ ప్ర‌మాద‌మ‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) హెచ్చ‌రిస్తోంది. ఈ సారి వృద్ధుల కంటే కూడా యువతనే ఎక్కువగా కొవిడ్‌-19 బారిన పడుతున్నారని ఐఎంఏ  అధ్యక్షుడు‌ జయపాల్ వెల్లడించారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకా అందిస్తున్నారు. కరోనా మరణాలను అరికట్టాలనే ఉద్దేశంతో వయసు రీత్యా ఎవరికి అవసరమో వారికి టీకాలను అందిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఐఎంఏ ప్రెసిడెంట్‌ జయపాల్ తప్పుపట్టారు.

 క‌రోనా సెకండ్ వేవ్ ‌లో యువతీయువకులే కరోనా బారిన పడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తమ స్ట్రాటజీని మార్చుకోవాలని సూచించారు. వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయాలని పేర్కొన్నారు.  భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ పెరగాలంటే రానున్న రెండు మూడు నెలల్లో 30 నుంచి 35 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

మొదటి దశతో పోలిస్తే సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు తగ్గాయని ఐఎంఏ ప్రెసిడెంట్‌ వెల్లడించారు. అయితే కరోనా బారిన పడే వారి సంఖ్య మాత్రం పెరిగిందని తెలిపారు. గతంలో ఒక కుటుంబంలో ఒకరిద్దరు మాత్రమే కరోనా బారిన పడితే.. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో ఐదు నుంచి ఆరుగురు కరోనా బారిన పడుతున్నారని చెప్పారు.