యూఏపీఏ చ‌ట్టం ప‌రిధిలోకి 23 మంది పాక్ ఉగ్ర‌వాదులు

యూఏపీఏ చ‌ట్టం ప‌రిధిలోకి 23 మంది పాక్ ఉగ్ర‌వాదులు
పాకిస్థాన్‌కు చెందిన 23 మందిని యూఏపీఏ చ‌ట్టం కింద ఉగ్ర‌వాదుల జాబితాలో చేర్చిన్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. జైషే మొహ‌మ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా, జ‌మాత్ ఉద్ ద‌వా, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ‌ల‌కు చెందిన ఉగ్ర‌వాదులు ఆ 23 మందిలో ఉన్నారు. యూఏపీఏ సెక్ష‌న్ 35 కింద ఆ 23 మందిని ఉగ్ర‌వాదులుగా తేల్చింది.  రిక్రూట్మెంట్‌, ట్రైనింగ్‌, చొర‌బ‌ట్లు, లాజిస్టిక్స్ మ‌ద్ద‌తతో ఆయుధాలు, డ్రోన్ ఆధారిత వెప‌న్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు ఆ ఉగ్ర‌వాదుల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
భార‌త్‌పై దాడులకు కూడా వాళ్లు ప్లాన్ వేసిన‌ట్లు తెలిసింది.  ఈ 23 మంది వ్యక్తులలో, ముగ్గురు లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి) వ్యవస్థాపకుడు హాఫిజ్ మహమ్మద్ సయీద్‌కు సన్నిహితులుగా ఆరోపించగా, మరో ముగ్గురు 2016లో నగోటాలోని ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నారని, ఇంకో ఇద్దరు 2018లో సుంజ్‌వాన్ మిలిటరీ స్టేషన్‌పై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. 
 
హోం మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో, సయీద్ సన్నిహితులుగా అబ్దుల్ రౌఫ్, హాఫిజ్ ఖాలిద్ వలీద్, రాణా ఇఫ్తికార్‌లను గుర్తించింది. “54 ఏళ్ల రాణా ఇఫ్తికార్, జిహాదీ వ్యతిరేక సంస్థల మధ్య సమన్వయం చేస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు యువతను ప్రేరేపిస్తాడు మరియు హాఫిజ్ సయీద్‌కు సన్నిహితుడు. ఎల్ఈటి, జమాత్-ఉద్-దావాకు చెందిన 52 ఏళ్ల అబ్దుల్ రౌఫ్, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణాళిక చేయడం, సమన్వయం చేయడం, నిధులు సేకరించడంలో పాలుపంచుకుంటాడు. హాఫిజ్ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష ఆదేశాల కింద ఎల్ఈటి లోని ప్రధాన ఉగ్రవాదులలో ఒకడు” అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
యూఏపీఏ జాబితాలో చేర‌డం వ‌ల్ల ఆ ఉగ్ర‌వాదుల‌కు నిధుల‌ను ఎన్ఐఏ అడ్డుకుంటుంది. 2019లో యూఏపీఏ చ‌ట్టాన్ని స‌వ‌ర‌ణ చేశారు.  అంత‌కుముందు కేవ‌లం ఉగ్ర సంస్థ‌ల‌ను మాత్ర‌మే నిషేధిత జాబితాలో ఉంచేవారు. ఇప్పుడు ఉగ్ర‌వాదుల‌ను వ్య‌క్తిగ‌తంగా కూడా అడ్డుకుంటున్నారు. 23 మంది పాకిస్థాన్ ఉగ్ర‌వాదులు ఇటీవ‌ల జ‌మ్మూక‌శ్మీర్‌లో భ‌ద్ర‌తా ద‌ళాల‌పై జ‌రిగిన దాడుల‌కు కార‌ణ‌మ‌య్యారు. దీనితో యూఏపీఏ జాబితాలో ఉగ్ర‌వాదుల సంఖ్య ఇప్పుడు 80కి చేరింది.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించడానికి డ్రోన్‌లు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ నియామక మార్గాలను ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సరిహద్దు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పలు భద్రతా, దర్యాప్తు సంస్థలు ట్రాక్ చేస్తున్న తరుణంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది.