మావోయిస్టుల నుంచి రాకేశ్వర్‌ బేషరతుగా విడుదల

మావోయిస్టుల చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌కు విముక్తి కలిగింది. ఐదు రోజులుగా  రాకేశ్వర్‌సింగ్‌ మావోల చెరలో ఉన్నాడు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదలను ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ధృవీకరించారు. తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు వదిలేశారు. కాసేపట్లో బెటాలియన్‌కు జవాన్‌ చేరుకోనున్నాడు. 

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాకేశ్వర్‌సింగ్‌‌ను నక్సలైట్లు బందీగా తీసుకెళ్లారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు.

చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ  మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని ప్రభుత్వానికి మావోయిస్టులు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక ముందే మావోయిస్టులు రాకేశ్వర్‌సింగ్‌ విడుదల చేయడం ఆసక్తిగా మారింది. జవాన్‌ విడుదలను ఛత్తీస్‌గడ్‌ ఐజీ ధ్రువీకరించారు.

మావోయిస్టులు తమ అధీనంలో కి తీసుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌‌ను  వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, కో కన్వీనర్లు ప్రొఫెసర్‌ జి.లక్ష్మణ్‌, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 

ఈనెల 3న భద్రతా దళాలు- మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. . తమకు చెందిన నలుగురు మృతి చెందారని మావోయిస్టులు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తమ వద్ద క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు. 

ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు చెబితే జవాన్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ మంగళవారం లేఖ విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం స్పందించలేదు. అకస్మాత్తుగా జవాన్‌ను విడుదల చేయడం మావోయిస్టుల వ్యూహం ఏమిటో అంతుచిక్కడం లేదు.