అధికార లాంఛనాలతో జవాన్ల అంత్యక్రియలు 

ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌లో మావోయిస్టుల కాల్పుల్లో వీరమరణం పొందిన అమర జవాన్లు రౌతు జగదీష్‌, శాఖమూరి మురళీకఅష్ణలకు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. వారి స్వగ్రామాల్లో మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
విజయనగరం జిల్లా గాజులరేగలో రౌతు జగదీష్‌ భౌతికకాయాన్ని భారీ జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించి శ్మశానవాటికకు తరలించారు. అధికార లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం జగదీష్‌ మృతదేహం వద్ద జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌, ఆర్‌డిఒ భవానీ శంకర్‌, విశాఖ రేంజ్‌ డిఐజి ఎల్‌కెవి.రంగారావు, సిఆర్‌పిఎఫ్‌ అధికారులు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు.
సిఆర్‌పిఎఫ్‌ జవాన్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు మూడు సార్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించి తుదివీడ్కోలు పలికారు. కార్యక్రమంలో సిఆర్‌పిఎఫ్‌ ఐజి.జివిహెచ్‌ గిరి ప్రసాద్‌, డిఐజి ఎ.శ్రీనివాస్‌, కమాండెంట్‌ సంజీవ్‌, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. .
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన మురళీకఅష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుండి ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తీసుకొచ్చారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జవాను మృతదేహానికి సతైనపల్లి డిఎస్‌పి విజయభాస్కరరెడ్డి నివాళులర్పించారు.
అనంతరం సతైనపల్లి నుండి గుడిపూడి వరకు కృష్ణ భౌతికకాయాన్ని ప్రదర్శనగా తీసుకెళ్ళారు. జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, డిఐజి త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్‌పి విశాల్‌ గున్నీ, నర్సరావుపేట ఎంపి లావు శ్రీకఅష్ణదేవరాయలు, సతైనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వైవి.ఆంజనేయులు జవాను భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ తరుపున తహశీల్దార్‌ యస్‌.రమణకుమారి మురళీకృష్ణ పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. గౌరవ వందనంగా సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.