పోలీసులకు, అరెస్టులకు భయపడే కార్యకర్తలు బీజేపీకి అవసరం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఎందరో కార్యకర్తల ప్రాణ త్యాగాల వల్లే బీజేపీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని గుర్తు చేశారు.
వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని చెబుతూ వచ్చే 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ద్యేయంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోల్కొండ కోటను చూస్తే దాని మీద కాషాయ జెండానే మనకు కనిపించాలని చెప్పారు.
చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేరి దోచుకుంటుందని సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన సాగుతోందని, అవినీతి, రజాకార్ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాక్షస పాలన నుంచి విముక్తి కోసం యువమోర్చా పోరాటం చేయాలని మార్గదర్శనం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉండదని సంజయ్ స్పష్టం చేశారు. ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తోందని పేర్కొంటూ టీఆర్ఎస్తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వం కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తుందని సంజయ్ దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని చెబుతూ పైసలు వెదజల్లి టీఆర్ఎస్ గెలిచిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎక్కడా విజయోత్సవాలు జరుపుకోలేదని గుర్తు చేస్తూ ఎలా గెలిచారో వారికి తెలుసని తెలిపారు.
వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటుందనే నమ్మకం వారికి లేదని పేర్కొంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే నాగార్జున సాగర్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చామని తెలిపారు.
బైంసాలో రిపోర్టర్లపై దాడి చేసింది హిందు వాహిని కార్యకర్తలని ఓ పోలీస్ అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పాడని సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఐపీఎస్ అధికారిని చూసి హిందువులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంఘ విద్రోహ శక్తులకు ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ని ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని, ప్రజల్ని కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
More Stories
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం