ఎమ్మెల్యే చెన్నమనేని జర్మనీ పౌరుడే

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అశుతోష్‌ ఆనంద్‌ హైకోర్టుకు నివేదించారు. 2009లో భారత పౌరసత్వం పొందిన చెన్నమనేనికి అప్పటికే 2013వరకు చెల్లుబాటు అయ్యే జర్మనీ పాస్‌పోర్టు కలిగి ఉన్నారని తెలిపారు. 
2013లో ఆయన జర్మనీ పాస్‌పోర్టును 2023 వరకు రెన్యువల్‌ చేయించుకున్నారన్నారు. జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో  ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ)కార్డును పొందారని, ఆ కార్డులో తాను జర్మనీ పౌరుడుగానే పేర్కొన్నారని వివరించారు. 
 
చెన్నమనేని పాస్‌పోర్టును 2023 వరకు జర్మనీ పొడిగించిందని, దీనిని బట్టి ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తర్వాత చెన్నమనేని భారత పౌరసత్వాన్ని పొందినప్పటికీ…  జర్మనీ పాస్‌పోర్టుపైనే విదేశీయానం చేశారని తెలిపారు. 
 
కేంద్ర ప్రభుత్వం వేసిన కౌంటర్‌పై రిప్లయ్‌ కౌంటర్‌ వేస్తామని, దానికి గడువు ఇవ్వాలని చెన్నమనేని తరఫున న్యాయవాది చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి గురువారం ఆదేశాలు జారీచేశారు.