కొండా సురేఖకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఇసి పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని కొండా సురేఖను హెచ్చరించింది. 

ఇతర పార్టీలను, నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇసి స్పష్టం చేసింది. ఈనెల 1న వరంగల్‌లో మీడియా సమావేశంలో కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్‌లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశాడని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. 

ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారని ఆమె తెలిపారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని అందువల్లే కెసిఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చాడే తప్పా, రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు బయటకు రాలేదని ఆమె విమర్శించారు. అధికారం లేకనే కెసిఆర్, కెటిఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని పేర్కొన్నారు. 

ఇప్పటికే కెటిఆర్ సోదరి శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్లారన్న ఆమె వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ కెటిఆర్, బిఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా నివేదిక తెప్పించుకుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎన్నికల అధికారి ఇంగ్లీష్‌లోకి అనువదించి పంపించారు. 

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ ఆమెకు హెచ్చరికలు జారీ చేసింది. జైలుకు వెళ్లడం ఖాయమన్న భయంతోనే కెటిఆర్ మాట్లాడుతున్నారన్న మంత్రి వ్యాఖ్యలను కూడా ఈసీ పేర్కొంది. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ, నేత ప్రతిష్టకు భంగం కలిగించేలా, ఎన్నికల ప్రక్రియకు అంతరాయంగా ఉన్నాయని ఈసీ వెల్లడించింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని, ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని మంత్రిని ఈసీ హెచ్చరించింది.